ఏడోసారి ఈడీ విచారణకు డుమ్మా కొట్టిన కేజ్రీవాల్.. ప్రతిరోజూ సమన్లు జారీ చేయడం ఏమిటని ఆప్ అసహనం

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ ఏడోసారి సమన్లు జారీ చేసింది. ఈరోజు కూడా ఆయన సమన్లకు ప్రతిస్పందించలేదు. ఈడీ విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ఆప్ స్పందిస్తూ... ప్రతిరోజూ సమన్లు జారీ చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు వెలువడేంత వరకు వేచి ఉండాలని సూచించింది. మార్చి 16న కోర్టులో విచారణ ఉందని.. అంతవరకు సంయమనం పాటించాలని కోరింది. తమపై ఎంత ఒత్తిడి చేసినా... ఇండియా కూటమిని ఆప్ వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. 

గత వారం కూడా కేజ్రీవాల్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. గత సోమవారం తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే, అప్పుడు కూడా ఈడీకి ఆప్ ఇదే సమాధానం ఇచ్చింది. మరోవైపు, కేజ్రీవాల్ విచారణకు హాజరు కాకపోవడంతో ఈడీ స్పందిస్తూ... కుంటి సాకులు చెపుతూ విచారణ నుంచి తప్పించుకుంటున్నారని విమర్శించింది. ప్రజా జీవితంలో అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తులే చట్టాలను గౌరవించకపోతే... అది సామాన్య ప్రజలకు చెడు సంకేతాలను పంపుతుందని వ్యాఖ్యానించింది.

Arvind Kejriwal
Delhi Liquor Scam
Enforcement Directorate
AAP

More Telugu News